మంచి, చెడూ రెండూ ఎదుర్కొన్నా!

25 Mar, 2023 02:00 IST|Sakshi

దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్‌ భాషల్లో సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల తెలుగులో ఆచార్య చిత్రంలో చిరంజీవితో కలిసి ఒక పాటలో నటించి అలరించింది. ఇక తమిళం విషయానికొస్తే ఇక్కడ కేడి బిల్లా కిల్లాడి రంగా చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్ర విజయంతో వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. అలా మానగరం, శరవణన్‌ ఇరుక్క భయమే, సిల్క్‌ వార్‌ పట్టి సింగం, మిస్టర్‌ చంద్రమౌళి చిత్రాల్లో నటించింది.

అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్‌ సీరీస్‌పై దృష్టి పెట్టింది. ఇప్పుడు వరుసగా వెబ్‌సీరీస్‌ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇటీవల ఈమె మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ పేర్కొంటూ నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌పర్మెంట్‌ వేదికగా మారిందని పేర్కొంది. కొత్త కొత్త పాత్రలు వస్తున్నాయని చాలా కథలు హీరోయిన్‌ ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్నాయని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నటీనటులకు వరప్రసాదంగా మారిందని పేర్కొంది. ఇక అభిమానులకు పసందైన విందు అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ట్రెండ్‌ వెండితెరకు కూడా పాకితే బాగుంటుందని అంది. మొత్తంగా చూసుకుంటే ఇది అందరికీ మంచి అవకాశం అని చెప్పింది.

సినిమా రంగంలో పురుషాధిక్యం గురించి చాలామంది మాట్లాడుతున్నారని, అయితే ఆడ మగ మధ్య తారతమ్యం అన్ని రంగాల్లోనూ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా హీరోల కంటే హీరోయిన్లకు పారితోషికం చాలా తక్కువే ఉంటుందని చెప్పింది. సినిమా అనేది గ్లామర్‌ ప్రపంచం కావడంతో ఇక్కడ జరిగే విషయాలు అధికంగా చర్చించబడతాయని, అదే కార్పొరేట్‌ రంగాల్లో అయితే నోరు మెదపరని చెప్పింది. తాను సినిమా రంగంలోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని పేర్కొంది. చాలా మార్పులు జరుగుతున్నాయని అంది. తాను 12 ఏళ్ల సినీ పయనంలో చాలా అనుభవాలను చవిచూవానని అందులో కొన్ని మంచి కొన్ని చెడ్డవి ఉన్నాయని రెజీనా పేర్కొంది.

మరిన్ని వార్తలు