Priya Bhavani Shankar: నాకైతే అలాంటి అనుభవం ఎదురుకాలేదు.. కానీ,

26 Mar, 2023 07:10 IST|Sakshi

కోలీవుడ్‌లో జయాపజయాలకతీతంగా అవకాశాలను అందుకున్న నటి ప్రియా భవానీ శంకర్‌. కేవలం ఆమె ఐదేళ్లలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఈమె ఓ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తరువాత టీవీ సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అలా 2017లో మేయాదమాన్‌ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వైభవ్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అంతే సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ బెర్త్‌ కన్‌ఫర్మ్‌ అయిపోయింది.

వరుసగా అవకాశాలు ఈ అమ్మడి తలుపు తడుతున్నాయి. ఈమె నటించిన చిత్రాల్లో ఎక్కవ భాగం విజయాలే. స్టార్‌ హీరోలతో నటించే అవకాశం వేస్తే పాత్రల గురించి కూడా ఆలోచించకుండా అంగీకరించేస్తోంది. అలా ఆ మధ్య కార్తీతో నటించిన కడైకుట్టి సింగం, అరుణ్‌ విజయ్‌తో జత కట్టిన తానై, ధనుష్‌ సరసన నటించి తిరుచిట్రంఫలం వంటి చిత్తాల సక్సెస్‌లు ఈమె ఖాతాలో పడ్డాయి. అయితే ఇటీవల జయం రవితో నటించిన అఖిలన్‌ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. తాజాగా శింబు కథానాయకుడిగా నటించిన పత్తు తల చిత్రంలో నటించింది.

ఇది ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. ప్రస్తుతం లారెన్స్‌కు జంటగా రుద్రన్‌, అరుళ్‌ నిధితో డిమాంటీ కాలనీ 2 తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మంచి అవకాశాలు వరుసగా రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే అడ్జెస్ట్‌మెంట్‌ అవ్వాలనే అంశం గురించి స్పందిస్తూ.. తనకైతే అలాంటి  అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. కానీ సినీరంగంలో ఆ సమస్య లేదని చెప్పలేనని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు