ముసలమ్మ పాటకు విశేష ఆదరణ.. ఎవరేమంటే నాకేంటి

10 Apr, 2023 07:22 IST|Sakshi

నటి నిత్యామీనన్‌ది ప్రత్యేక బాణి. పాత్ర నచ్చితే చాలు అది హీరోయిన్‌ పాత్ర, గెస్ట్‌ పాత్ర అని చూడదు. నటించడానికి సై అంటుంది. పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడి చిత్రమైనా నో చెప్పేస్తుంది. పదేళ్ల ప్రాయంలోనే బాల నటిగా రంగప్రవేశం చేసిన ఈ మలయాళీ బ్యూటీ, అంచలంచెలుగా ఎదిగి కథానాయకి స్థాయిలో రాణిస్తోంది. మొదట్లో మలయాళం, తెలుగు భాషల్లో నటించిన నిత్యామీనన్‌ తమిళంలో సిద్ధార్థ్‌కు జంటగా 108 చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. బహుబాషా నటిగా గుర్తింపు పొందిన ఈ అమ్మడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన కాదల్‌ కణ్మణి మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత రాఘవ లారెన్స్‌కు జంటగా కాంచన –2, విజయ్‌ సరసన మెర్సల్‌ వంటి చిత్రాలలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి గట్టిగా తనేంటో చాటుకుంది. అదే విధంగా తెలుగులో గీత గోవిందం చిత్రంలో కీలక పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకుంది. విషయం ఏంటంటే నిత్యామీనన్‌ విషయంలో పొట్టి, బొద్దు వంటివి ఆటంకం కాలేదు. వాటి గురించి వస్తున్న విమర్శలను ఆమె అసలు పట్టించుకోదు. తనకు నచ్చిన పాత్రలకు ఎలా న్యాయం చేయాలా అన్న విషయంపైనే దృష్టి పెడుతుంది.

ఆమె ఇటీవల తమిళంలో ధనుష్‌కు జంటగా తిరుచిట్రంఫలం చిత్రంలో నటించి ఆ చిత్ర విజయానికి కీలకంగా మారింది. అందులో కూడా ఆమె ఆకారాన్ని వెటకారంగా చూపుతూ ఒక పాట కూడా ఉంటుంది. తాయ్‌ కెళవి (ముసలమ్మ) అంటూ సాగే ఆ పాట ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణ పొందింది. నిత్యామీనన్‌ వయసు 35 ఏళ్లు. ఇప్పటికీ ఆమె అవివాహితే అన్నది గమనార్హం. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న నిత్యామీనన్‌కు అవకాశాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి.

మరిన్ని వార్తలు