ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం: రమ్యతో బంధం తెంచుకోవాలని..

9 May, 2023 21:25 IST|Sakshi

అన్నానగర్‌: గర్భిణిని హత్య చేసిన కేసులో ఆమె భర్త, అత్తమామలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన సతీష్‌ కుమార్‌ (31) డ్రైవర్‌. తేని జిల్లా కడమల కుందూకు చెందిన నర్సు రమ్య(25)ను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం వేళాచ్చేరి మునియంతిపురంలోని కురింజినగర్‌లో కాపురం పెట్టారు.

ఈ క్రమంలో రమ్య గర్భం దాల్చింది. అయితే సతీష్‌కుమార్‌, రమ్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రమ్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో బంధువులు ఆమెకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపించారు. శనివారం సతీష్‌ కుమార్‌ మరోసారి రమ్యతో గొడవపడ్డాడు. ఆగ్రహంతో నిర్మాణ పనులకు ఉపయోగించే దుంగతో కొట్టాడు. రమ్య తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది.

తిరుపరంగున్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సతీష్‌కుమార్‌ తల్లిదండ్రులు రమ్యతో బంధాన్ని తెంచుకోవాలని ఒత్తిడి చేశారని.. ఈ క్రమంలోనే ఆమైపె దాడి జరిగిందని తెలిసింది. ఆదివారం రాత్రి రమ్య మృతదేహాన్ని మదురై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. సతీష్‌కుమార్‌ (31), అతని తండ్రి సెల్వం (55), తల్లి పంచవర్ణంను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు