ఇది నర్సన్న పూలగుట్ట!

20 Dec, 2020 08:40 IST|Sakshi
యాదాద్రి దేవస్థానం చుట్టూ ఏర్పాటు చేసిన గ్రీనరీ

కృష్ణశిలల సౌందర్యం.. ఫలపుష్పాల సోయగం.. మధ్యలో కొంగుబంగారమై విలసిల్లే యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ క్షేత్రం. యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ సుగంధ పరిమళాలను అద్దుకుంటోంది. అందంగా అల్లుకున్న లతలు.. మదిదోచే పూదోటలు.. నేలపై హరివిల్లు విరిసినట్టు.. కనుచూపు మేర పచ్చదనం తివాచీలా పరుచుకుని వెల్లి‘విరి’స్తోంది. రూ.5 కోట్లతో చేపట్టిన మొక్కల పెంపకంతో యాదాద్రి పూలగుట్టను తలపిస్తోంది. వందకుపైగా ఫల, పుష్ప, ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే మహావృక్షాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. వీటిని థాయ్‌లాండ్, బెంగళూరు, ఏపీలోని కడియంతో పాటు ప్రసిద్ధిచెందిన నర్సరీల నుంచి తెప్పించారు. ఇప్పటివరకు 90 శాతం మొక్కలు నాటడం పూర్తయ్యింది. 2021 జనవరి చివరి నాటికి పచ్చదనాన్ని సిద్ధం చేయాలనే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పనుల్ని
ముమ్మరం చేశారు. 
– సాక్షి, యాదాద్రి


రాయగిరి నుంచి యాదాద్రికి వెళ్లేదారిలో రోడ్డుకు ఇరువైపులా, మధ్యలో పచ్చని చెట్లు, పూల మొక్కలు

‘యాదాద్రి’కి పసిడి శోభ 
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలోని క్యూలైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ క్యూలైన్లను ప్రత్యేక టెక్నీషియన్లు బంగారు వర్ణంతో తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన ఆలయ ముఖద్వారం నుంచి స్వామిని దర్శించుకుని వెళ్లే వరకు పసిడి వర్ణంలో ఉండే ఈ క్యూలైన్లు ఆలయానికి మరింత శోభను తేనున్నాయి.      


– సాక్షి స్టాఫ్‌  ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి 

మరిన్ని వార్తలు