ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళనాడు సీఎం

16 Mar, 2021 15:22 IST|Sakshi

చెన్నె: రహాస్య బంధాన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ బహిరంగపరిచారు. అన్నాడీఎంకే, బీజేపీలు కలిసి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లగా ఆదిలోనే అన్నాడీఎంకే బీజేపీకి షాకిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సీఏఏ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో పళనిస్వామి సీసీఏ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వమే మైనార్టీలకు భద్రత కల్పిస్తుందని ప్రకటించారు.

మైనార్టీలు తమను విజ్ఞప్తి చేశారని.. ఆ విజ్ఞప్తి మేరకు తాము సీఏఏ ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని కోరుతామని పళనిస్వామి తెలిపారు. ఈ విషయమై తాము హామీ ఇస్తున్నట్లు చెప్పారు. సీఏఏ విషయమై తమ పార్టీ మానిఫెస్టోలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. ఈ ప్రకటన బీజేపీకి షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ చట్టం తప్పనిసరిగా అమలుచేయాలని భావిస్తోంది. ఈ సమయంలో అన్నాడీఎంకే తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి నష్టం చేకూరుస్తుందని తెలుస్తోంది. 

డిసెంబర్‌ 22, 2019లో తీసుకువచ్చిన సీఏఏ చట్టం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చట్టానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే ఈ చట్టం ప్రస్తావన తీసుకురావడం బీజేపీకి మింగుడు పడని విషయంగా భావించవచ్చు. అయితే ఈ ప్రకటన రావడానికి కారణం మొన్న స్టాలిన్‌ సీఏఏ చట్టాన్ని చెత్తకాగితంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తామని హామీ ప్రకటించడంతో అన్నాడీఎంకే సీఏఏపై ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. తమిళనాడులో ఏప్రిల్‌ 6వ తేదీన ఒకే విడతన ఎన్నికలు జరగనున్నాయి.

చదవండి: కమల్‌హాసన్‌ ఆస్తులు ఎంతో తెలుసా..?
చదవండి: కోటి రూపాయల్లేని ముఖ్యమంత్రి.. ఎవరాయన?

మరిన్ని వార్తలు