ఆసక్తికర సన్నివేశం.. నవ్వుతూ పలకరించుకున్న బండి సంజయ్‌, కవిత

31 May, 2023 16:34 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం అయ్యింది. ఓ శుభకార్యంలో తారసపడ్డ ఎమ్మెల్సీ కవిత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు ఒకరినొకరు పలకరించుకున్నారు. నేడు (బుధవారం) బీజేపీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య నూతన గృహ ప్రవేశానికి ఈ ఇద్దరు నేతలు హాజరయ్యారు.

ఈ క్రమంలో ఒకేసారి ఇద్దరు ఎదురుపడిన సమయంలో బండి సంజయ్‌, కవితలు అభివాదం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నేతలను బండి సంజయ్‌కు ఎమ్మెల్సీ కవిత పరిచయం చేశారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే గణేష్‌ గుప్తాతోపాటు జడ్పీ ఛైర్మన్‌ విఠాల్‌ రావు, కార్పొరేటర్లను సంజయ్‌కు పరిచయం చేశారు.

అయితే రాజకీయ జీవితంలో ఒకరినొకరు విమర్శించుకునే బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ నేతలు తారసపడి, నవ్వుతూ పలకరించుకోవడంతో అక్కడున్న వారు అంతా ఆసక్తిగా చూశారు. వీరిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 

మరోవైపు ఢిల్లీలో నిరసన చేస్తున్న రెజ్లర్లకు ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించారు. బ్రిజ్‌ భూషన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెజ్లర్లు భారత్ ప్రతిభను ప్రపంచానికి తెలియజేశారని, బంగారు పతకాలు సాధించిన రెజ్లర్ల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని సూచించారు. పోక్సో వంటి తీవ్ర అభియోగాలున్న నిందితుడు బయట తిరుగుతున్నాడని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.
చదవండి: వరంగల్‌: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు!

మరిన్ని వార్తలు