అవినాష్‌రెడ్డి సీబీఐకి సహకరిస్తున్నా.. లేదంటూ మెన్షన్‌!

9 Jun, 2023 12:22 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వివేకా హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు(వెకేషన్‌ బెంచ్‌) కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్‌ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

జూన్‌ 13న జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలన్నది సునీత పిటిషన్ సారాంశం. ఇవాళ(శుక్రవారం) సుప్రీంకోర్టులో పిటిషన్‌పై మెన్షన్ చేసిన సునీత తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా విచారణ చేపట్టాలని కోరారు.

వివేకా కేసులో దర్యాప్తు కోసం రావాలని సీబీఐ కోరుతున్నా.. అవినాష్‌రెడ్డి హాజరు కాలేదని న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు. అయితే, ఇప్పటివరకు 7 సార్లు అవినాష్‌ రెడ్డి సీబీఐ ముందు హాజరు అయిన విషయం తెలిసిందే. బెయిల్‌ తర్వాత కూడా శనివారం రోజున అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. ఈ విషయాన్ని సమగ్రంగా వివరించకుండా.. అవినాష్‌రెడ్డి లక్ష్యంగా కొన్ని తప్పుడు వాదనలు వినిపించారు సునీత తరపు న్యాయవాది. 

ఇక తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు జరిగిన వాదనల సందర్భంగా హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను మాత్రం సునీత తన పిటిషన్‌లో  సుప్రీంకోర్టు ముందు ఉంచకపోవడం గమనార్హం. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం హియర్ సే పేరుతో, కొన్ని కల్పిత కథనాలను సృష్టించి, వాటిని తెలుగుదేశం సహకారంతో ఎల్లో మీడియాలో పబ్లిష్ చేయించి వాటి ఆధారంగానే మరోసారి సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించినట్టు తాజా పిటిషన్ ద్వారా అవగతమవుతోంది.

దర్యాప్తునకు అవినాష్‌రెడ్డి అన్నివిధాలుగా సహకరిస్తున్నప్పటికీ.. సునీత తరపు న్యాయవాది మాత్రం ఆయన దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ ధర్మాసనానికి  వినిపించారు. దీనిపై స్పందించిన బెంచ్‌.. పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది.

ఇదీ చదవండి: ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు!

మరిన్ని వార్తలు