ఆన్‌లైన్‌ పాఠాలకు 1.12 లక్షల మంది దూరం!

3 Jul, 2021 07:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైనా.. లక్ష మందికిపైగా విద్యార్థులు వాటిని అందుకోలేని పరిస్థితిలో ఉన్నారని విద్యాశాఖ గుర్తించింది. దూరదర్శన్, టీశాట్, ఇతర టీవీ చానళ్లు, ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా డిజిటల్‌ పాఠాలకు ఏర్పాట్లు చేశామని.. ఈ పాఠాలను చూడాలంటే టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌ వంటి డిజిటల్‌ డివైజ్‌లలో ఏదో ఒకటైనా ఉండాలని తెలిపింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ అందుబాటులో లేని విద్యార్థులు 1,12,559 మంది ఉన్నారని.. మొత్తం విద్యార్థుల్లో వీరు 6.06 శాతమని వెల్లడించింది.

గురువారం నుంచి ఆన్‌లైన్‌/డిజిటల్‌ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పరిస్థితిపై విద్యాశాఖ శుక్రవారం సమీక్షించింది. దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. మొత్తం విద్యార్థుల్లో 12,68,291 మంది అంటే.. 68.29 శాతం మంది ఆన్‌లైన్‌/డిజిటల్‌ పాఠాలు విన్నారని పేర్కొంది. ఇంకా 31.71 శాతం మంది పాఠాలకు దూరంగా ఉన్నారని తెలిపింది. 

మరిన్ని వార్తలు