ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం

19 Sep, 2022 01:58 IST|Sakshi
మాట్లాడుతున్న భూక్య సంజీవ్‌ నాయక్‌  

గిరిజన రిజర్వేషన్‌ సాధన సమితి చైర్మన్‌ సంజీవ్‌నాయక్‌ 

సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్‌): గిరిజనుల(ఎస్టీ) రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచటంతోపాటు గిరిజనబంధును ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని గిరిజన రిజర్వేషన్‌ సాధన సమితి చైర్మన్, సేవాలాల్‌ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ నాయక్‌ అన్నారు. ఆదివారం బాగ్‌ లింగంపల్లిలోని లంబాడి తండాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1986లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 4 శాతం ఉన్న రిజర్వేషన్లను 6 శాతానికి పెంచితే, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ 10 శాతానికి పెంచటం గొప్ప పరిణామమని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనులకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని కొనియాడారు. తండాలను గ్రామపంచాయితీలుగా చేస్తానని చెప్పి 3,600 తండాలను గ్రామ పంచాయితీలుగా చేశారని, ఇప్పుడు వాటన్నింటికీ గిరిజనులే సర్పంచులుగా ఉండటం గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, సేవాలాల్‌ సేన గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు కళ్యాణనాయక్, నేతలు ఓబానాయక్, మున్నా, దేవేందర్, దేవరాజు, కృష్ణ, నందు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు