బాలిక మిస్సింగ్‌ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం

16 Dec, 2022 12:33 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలిక మిస్సింగ్‌ కేసు విషాదాంతమైంది. దమ్మాయిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది.  దీంతో చెరువు వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. ‍ అయితే, పాఠశాల నుంచి బాలిక చెరువు వద్దకు ఎందుకు వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లారా? హత్య చేసి చెరువులో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. 

ఏం జరిగింది?
దమ్మాయిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్‌మాస్టర్‌ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్‌ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్‌ హెడ్‌మాస్టర్‌, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్‌ స్వ్కాడ్స్‌, క్లూస్‌ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్‌ స్వ‍్కాడ్స్‌ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. 

ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యకు హెచ్‌ఐవీ సోకే విధంగా వైద్యం

మరిన్ని వార్తలు