రాష్ట్రంలో 80,751కి చేరుకున్న కేసుల సంఖ్య
పది మంది మృతి.. 637కి చేరిన మరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఉదయం బులెటిన్ విడుదల చేశారు. ఆదివారం 11,609 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 10.81 శాతం (1,256) కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6.24 లక్షల మందిని పరీక్షించగా, కోవిడ్ బారిన పడ్డవారి సంఖ్య 80,751కి చేరింది. తాజాగా 10 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 637కి పెరిగింది. తాజాగా 1,587 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 57,586కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 15,789 మంది హోం లేదా ఇతరత్రా ఐసోలేషన్లో ఉంటున్నారు. రికవరీ రేటు దేశంలో 68.78 శాతం ఉండగా, తెలంగాణలో 71.31 శాతంగా ఉంది. ఆదివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 389 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 86, సంగారెడ్డి 74, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 67, ఆదిలాబాద్ 63, నల్లగొండ 58, సిద్దిపేట జిల్లాలో 45 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5,906 పడకలు ఖాళీ...
కరోనా చికిత్స అందించే 56 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8,436 పడకలకుగాను, 2,530 నిండిపోగా.. 5,906 ఖాళీగా ఉన్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా చికిత్స అందించే 91 ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో 6,850 పడకలు కరోనా కోసం కేటాయించగా, 4,209 పడకలు రోగులతో నిండిపోయాయి. ఇంకా 2,641 పడకలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొత్తం 8,547 పడకలు ఖాళీగా ఉన్నాయని బులెటిన్లో పేర్కొన్నారు. జిల్లాలు, ఆసుపత్రుల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీగా ఉన్నాయో బులెటిన్లో వివరించారు.