సింగపూర్‌లో కోవిడ్‌ బాధితులకు అండ

5 Aug, 2020 08:09 IST|Sakshi
శ్రీహర్ష

రూ.20 లక్షలు అందజేసిన తెలుగుతేజం

సాక్షి, సిటీబ్యూరో: తెలుగుతేజం 15 ఏళ్ల  శ్రీహర్ష శిఖాకొళ్లు  సింగపూర్‌లో  కోవిడ్‌ బాధితులకు అండగా నిలిచాడు. మహమ్మారి నియంత్రణ కోసం ‘నేను సైతం’ అంటూ కదిలాడు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి బాధితులకు ఆర్థిక సాయం అందజేశాడు.  గుంటూరుకు చెందిన శ్రీహర్ష సింగపూర్‌ అమెరికన్‌ హై స్కూల్‌లో చదువుకుంటున్నాడు. ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించే లక్ష్యంతో  90 రోజుల పాటు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాడు. అలాగే ‘‘అవసరమైన వారికి సహాయం చేయండి. వారిలో ఆశలను నింపండి’’ అనే నినాదంతో విరాళాలు సేకరించాడు.

దాతల నుంచి రూ.20 లక్షల  విరాళాన్ని  సింగపూర్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గివ్‌ డాట్‌ ఎస్‌.జీ’ అనే చారిటీ సంస్థకు ఆ విరాళాన్ని అందజేశాడు. ఈ సంస్థ  ప్రస్తుతం సింగపూర్‌లోని కోవిడ్‌ బాధితులకు వైద్యం, మందులు, తదితర సదుపాయాలను అందజేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా లభించిన స్ఫూర్తితో తాజాగా తన సహా విద్యార్థులతో కలిసి ‘ఎకాన్‌ 101’ అనే సంస్థను స్థాపించాడు. యువ విద్యార్థులకు ఆర్ధిక అక్షరాస్యతపై జూమ్‌ యాప్‌ ద్వారా  అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాడు. విద్యార్ధుల భవిష్యత్‌కు, చక్కటి కెరీర్‌ నిర్మాణానికి దోహదం చేసే ఈ అవగాహన కార్యక్రమంలో  8 నుంచి 13 ఏళ్ల వయస్సు పిల్లలు పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు