డ్రంకెన్‌ డ్రైవర్‌తో జర్నీనా.. ఆలోచించాల్సిందే

20 Jan, 2021 03:37 IST|Sakshi

రోడ్డు ప్రమాదాల్లో సహచర డ్రంకన్‌ ప్రయాణికుడి పైనా కేసులు

మాదాపూర్‌ రోడ్డు ప్రమాదంలో ఈ తరహా ఎఫ్‌ఐఆర్‌ నమోదు

రోడ్డు భద్రతలో భాగంగానే అంటున్న సైబరాబాద్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల సికింద్రాబాద్‌ క్లబ్‌ మేనేజర్‌ గౌతమ్‌దేవ్‌ గాడాయ్, ఆయన భార్య శ్రావణి శ్వేతలు మాదాపూర్‌లో బైక్‌పై వెళ్తుండగా... మద్యం తాగిన మత్తులో ఎస్‌యూవీ కారు నడుపుకుంటూ వచ్చిన కాశీ విశ్వనాథ్‌ రోడ్డు ప్రమాదం చేశాడు. ఈ ఘటనలో గౌతమ్‌ దుర్మరణం చెందగా, భార్య శ్వేతకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు అతడిపక్కనే కూర్చున్న వ్యక్తికి బ్రీత్‌ అనలైజర్‌ టెస్టులు చేయడంతో మద్యం తాగినట్టుగా తేలింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్‌ పోలీసులు ఇద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

ఇన్నాళ్లూ మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారుకుడైన డ్రైవర్‌పైనే కేసులు నమోదు చేసేవారు. అయితే రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో డ్రంకన్‌  డ్రైవర్‌తో పాటు అతడి పక్కనే కూర్చున్న మద్యం తాగిన వ్యక్తిపై కూడా 304 పార్ట్‌ టూ రెడ్‌విత్‌ 109 ఐపీసీ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు సైబరాబాద్‌ పోలీసులు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే ఈ తరçహాలో చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ డ్రంకన్‌డ్రైవ్‌ చెక్‌లో దొరికిన పక్షంలో ఒక్క డ్రైవర్‌ పైనే కేసులు నమోదు చేస్తున్నారు. 

డ్రంకన్‌  డ్రైవ్‌ ప్రమాదాల్లో 153 మంది మృతి..
‘గతేడాది సైబరాబాద్‌ పరిధిలో 144 రోడ్డు ప్రమాదాలు డ్రంకన్‌ డ్రైవ్‌ వల్ల జరిగితే 153 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరు వాహనచోదకులే మృతి చెందారు. మరికొందరు ఎదుటి వాహనాల వాళ్లు, పాదచారులు... ఏమాత్రం సంబంధం లేనివారు చనిపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. డ్రంకన్‌  డ్రైవర్‌ గురించి తెలిసీ మరీ అతడి వాహనంలోనే కూర్చుంటున్న మద్యం తాగిన ఇతర వ్యక్తిని క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా చేరుస్తున్నాం. వీటివల్ల డ్రంకన్‌  డ్రైవ్‌ ప్రమాదాలు తగ్గి ఎంతోమంది ప్రాణాలు నిలిచే అవకాశముంద’ని సైబరాబాద్‌ పోలీసు విభాగాధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు