మొత్తం 13.65 లక్షల టెస్టులు.. 1.25 లక్షల కేసులు
తాజాగా 9 మంది మృతి.. 827కి చేరిన మరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 1,873 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ సోకిన వారి సంఖ్య 1,24,963కి చేరిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించారు. తాజాగా 1,849 మంది కోలుకోగా, మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 92,837కి చేరుకుంది. కరోనాతో మరో 9 మంది మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 827కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్తో 31,299 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 24,216 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని ఆయన వివరించారు. ఆదివారం ఒక్కరోజు 37,791 నమూనాలను పరీక్షించగా, ఇప్పటివరకు మొత్తం 13,65,582 మందికి పరీక్షలు నిర్వహించినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
10 లక్షల జనాభాకు 36,782 మందికి..
రాష్ట్రంలో ప్రతీ 10 లక్షల మంది జనాభాలో 36,782 మందికి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు బులెటిన్లో తెలిపారు. ఇక ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో 35 చోట్ల ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 చోట్ల చేస్తున్నారు. ఇక ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,076 చోట్ల చేస్తున్నారు. ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 360 రాగా, కరీంనగర్ జిల్లాలో 180, రంగారెడ్డి జిల్లాలో 129, ఖమ్మం జిల్లాలో 103, నిజామాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 94 చొప్పున కేసులు బయటపడ్డాయి.