ఒక్కరోజే 21,380 మందికి కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం (30న) కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 62,703కు చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ను విడుదల చేసింది. ఒక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 519కి చేరింది. ఒక్కరోజే అత్యధికంగా 21,380 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఇంకా 1,216 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 4,37,582కి చేరింది. కరోనా బారినుంచి గురువారం 816 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 45,388కి చేరింది. ప్రస్తుతం 16,796 యాక్టివ్ కేసులున్నాయి. అందులో హోమ్ ఐసోలేషన్లో 10,632 మంది ఉన్నారని ఆయన వెల్లడించారు. మిగిలినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జీహెచ్ఎంసీలోనే అత్యధిక కేసులు...
గురువారం అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 586 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఒక్కోదాంట్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 207, రంగారెడ్డిలో 205, వరంగల్ అర్బన్లో 123, కరీంనగర్లో 116, సంగారెడ్డిలో 108, కామారెడ్డి 46, మెదక్లో 45, ఖమ్మంలో 41, మహబూబ్నగర్లో 61, మహబూబాబాద్ 37, నల్గొండలో 36, మంచిర్యాలలో 35, గద్వాలలో 32, నాగర్ కర్నూలులో 30, వరంగల్ రూరల్ జిల్లాలో 30, భద్రాద్రి కొత్తగూడెంలో 29, ములుగులో 27, పెద్దపల్లిలో 26, సిరిసిల్లలో 23, జనగామలో 21, సిద్దిపేటలో 20 కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 8,691 కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 6,164 ఖాళీగా ఉండగా, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో 2,527 పడకలు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు.