రెండు తలల పాము @ 70 లక్షలు.. ఈ పాము ఇంట్లో ఉంటే..

16 Sep, 2021 14:31 IST|Sakshi

అమ్మకానికి పెట్టిన ముఠా..

ఆటకట్టించిన అటవీ శాఖ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రెండు తలల పామును అమ్మ కానికి పెట్టిన ముఠాను బుధవారం అటవీశాఖ విజిలెన్స్‌ విభాగం అదుపులోకి తీసుకుంది. ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టం కలిసివస్తుందని, గుప్తనిధులు దొరుకుతాయని తమ వద్దనున్న పామును ఈ ముఠా అమ్మకానికి పెట్టింది. తమకందిన సమాచారంతో విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో దాడిచేసి.. ఈసీఐఎల్‌ సమీపంలోని నాగారంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ.ఆంజనేయప్రసాద్‌తో కూడిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

నాలుగున్నర కేజీల బరువున్న పామును డెబ్బై లక్షలకు వీరు అమ్మకానికి పెట్టారని, వీరితో పాటు కారు, టూవీలర్, 4 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. నిందితులను మేడ్చల్‌ కోర్టు లో హాజరుపరిచారు. ముఠా ఆటకట్టించిన అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభ అభినందించారు. కాగా, రెండు తలల పాముగా పిలిచే ‘రెడ్‌ సాండ్‌ బోవా’కు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా అదృష్టం కలిసిరావటమనేది అపోహేనన్నారు. ఈ పాముకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్‌ 18004255364కు ఫిర్యాదు చేయాలన్నారు. 
చదవండి: ఇవి మామూలు కళ్లద్దాలు కావు.. కనీసం రూ.25 కోట్లు
హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు