వరంగల్‌లో నకిలీ నోట్ల కలకలం.. గుట్టలుగా రూ.2 వేల కట్టలు

18 Nov, 2022 17:24 IST|Sakshi

సాక్షి, వరంగల్: వరంగల్‌లో దొంగ నోట్లు ముద్రిస్తున్నముఠా గుట్టు రట్టయ్యింది. ఈ మేరకు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున​ నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమీషనర్‌ సీపీ తరుణ్‌ జోషీ మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన నిందితుల నుంచి రూ. 2 వేల నకిలీ కరెన్సీ నోట్లను సుమారు రూ. 6లక్షల వరకు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే ఏడు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు

నిందితులు సయ్యద్‌ యూకుబ్‌, అలియాస్‌ షకీల్‌, గడ్డం ప్రవీన​, గుండా రజనీగా ప్రకటించారు. వీరంతా ఒక కిడ్నాప్‌ కేసులో రామగుండం సబ్‌జైలులో శిక్ష అనుభవించినట్లు చెప్పారు. అక్కడే దొంగ నోట్లు ముద్రించే సభ్యులతో పరిచయం పెంచుకుని ఈ నకిలీ నోట్ల తయారీ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ నకిలీ నోట్లను యూట్యూబ్‌ సాయంతో తయారు చేసినట్లు తెలిపారు. రద్దీగా ఉండే వ్యాపార కూడళ్ల తోపాటు కిరాణా, బట్టలషాపు, బెల్టు షాపుల్లో ఈ నకిలీ నోట్లను చెలామణి చేసేవారని తెలిపారు. 

(చదవండి: కలలు.. కల్లలయ్యాయి.. జీవితమెంత విచిత్రమైంది)

మరిన్ని వార్తలు