కొత్తగా 2,278 మందికి కరోనా 

13 Sep, 2020 05:07 IST|Sakshi

రాష్ట్రంలో 1.54 లక్షలకు చేరిన మొత్తం కేసుల సంఖ్య 

హైదరాబాద్‌: తెలంగాణలో శుక్రవారం 62,234 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 950కి చేరింది. కరోనా నుంచి తాజాగా 2,458 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,21,925కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,005 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 25,050 మంది హోం లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ  పరీక్షల సంఖ్య 20,78,695కి చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 55,989 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చినవారు 1,06,867 (69%) మంది ఉన్నారు. లక్షణాలతో కరోనా సోకిన వారు 48,013 (31%) ఉన్నారు. వైరస్‌ సోకి చనిపోయిన కేసుల్లో 46.13 శాతం మంది కరోనాతో చనిపోగా, మిగిలిన 53.87 శాతం మంది కరోనాతోపాటు ఇతరత్రా అనారోగ్యాలతో చనిపోయారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 చోట్ల, ప్రైవేట్‌లో 38 కేంద్రాల్లో చేస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలను 1,076 ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నారు. ఇదిలావుంటే ఒక రోజులో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 331, రంగారెడ్డి జిల్లాలో 184, మేడ్చల్‌లో 150, నల్లగొండలో 126, కరీంనగర్‌లో 121 నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు