ఇంకా 23 శాతం రైళ్లు ఆలస్యమే!

15 Nov, 2022 04:11 IST|Sakshi

సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ రైల్వేను ఆధునికీకరిస్తున్న రైల్వే శాఖ.. కొన్ని రైళ్లు సకాలంలో గమ్యం చేరే విషయంలో మాత్రం మరింత దృస్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్ప టికీ ఇంకా 23 శాతంమేర రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. అయితే, గతంలో ఈ శాతం ఎక్కు వగా ఉండగా, ఇప్పుడు వీలైనంతమేర తగ్గించటంలో రైల్వే శాఖ విజయం సాధించిందనే చెప్పాలి.

దాదాపు 76 శాతం రైళ్లు సకాలంలో గమ్యం చేరుతుండటమే దీనికి తార్కాణం. తాజాగా ఎన్ని రైళ్లు సకాలంలో చేరుతున్నాయి, ఎన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి అన్న విషయంలో దేశవ్యాప్త వివరాలను రైల్వే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ కోరిన సమాచారాన్ని రైల్వే తాజాగా అందజేసింది. ఆ వివరాల ప్రకారం.. 2016 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 23 వరకు దేశవ్యాప్తంగా రాజధాని, దురొంతో, శతాబ్ది, జనశ తాబ్ది ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు.. ఇలా కేటగిరీలు కలిపి 7689535 సర్వీసులు ఉండగా, 58,59,631 రైళ్లు సకాలంలో గమ్యం చేరాయి. 18,29,904 రైళ్లు మాత్రం ఆలస్యంగా గమ్యం చేరాయి.

ప్యాసింజర్‌ రైళ్లే ఆలస్యం
పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే ప్యాసింజర్‌ రైళ్లలో 25.76 శాతం జాప్యం నమోదు కాగా, ధనికులు ఎక్కువగా ప్రయాణించే శతాబ్ది రైళ్లలో అతి తక్కువగా 12.45 శాతం మాత్రమే జాప్యం నమోదైంది. విచిత్రమేంటంటే రైల్వే శాఖ ఎంతో ప్రాధాన్యమిచ్చే రాజధాని సర్వీసుల్లో కూడా 25.65 శాతం జాప్యం నమోదైంది. దురొంతోలో 28.10 శాతం , జన శతాబ్దిలో 14.74 శాతం, సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 19.05 శాతం మేర ఆలస్యంగా నడిచాయి. 

మరిన్ని వార్తలు