వంద కోసం అటెండర్‌ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది

31 Oct, 2021 10:19 IST|Sakshi

ఆస్పత్రి అటెండర్‌ కక్కుర్తికి చిన్నారి బలి 

నీలోఫర్‌లో ఘటన.. బంధువుల ఆందోళన  

సాక్షి,నాంపల్లి(హైదరాబాద్‌): ఆస్పత్రి అటెండర్‌ కక్కుర్తి మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన శనివారం హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోరబండ ప్రాంతానికి చెందిన షేక్‌ ఆజం కుమారుడు షేక్‌ ఖాజా(3) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు బాలుడిని ఈ నెల 27న నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు ఆ చిన్నారికి వెంటిలేటర్‌ అమర్చి వైద్యం అందిస్తున్నారు.

ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న సుభాష్‌ అనే అటెండర్‌ శనివారం ఆ వార్డుకు వచ్చాడు. పక్క బెడ్‌ మీద ఉన్న రోగి సహాయకుల నుంచి వంద రూపాయలు తీసుకుని షేక్‌ ఖాజాకు సంబంధించిన వెంటిలేటర్‌ను మార్చేశాడు. కొద్దిసేపటికే షేక్‌ ఖాజా శ్వాస అందక మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అటెండర్‌పై  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణను వివరణ కోరగా స్పందించడానికి నిరాకరించారు.    

చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి..

మరిన్ని వార్తలు