హైదరాబాద్‌ టు ఢిల్లీ  ‘వందేభారత్‌’.. పింక్‌ బుక్‌లో ఏముందో..  

2 Feb, 2022 15:29 IST|Sakshi

గంటకు 160 కి.మీ వేగంతో పరుగులు  

మరిన్ని కొత్త రైళ్లు లేనట్లే.. 

పాత ప్రాజెక్టుల భవితవ్యం పింక్‌బుక్‌లో నిక్షిప్తం

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు  వందేభారత్‌  పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా 400 వందేభారత్‌ రైళ్లకు కేంద్రం ఈ బడ్జెట్‌లో పచ్చజెండా ఊపిన  నేపథ్యంలో గతంలోనే  ప్రతిపాదించినట్లుగా హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్‌–ముంబయి, కాచిగూడ–బెంగళూర్‌ నగరాల మధ్య వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు  గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్‌లో మరో 400 రైళ్లను కేంద్రం కొత్తగా ప్రకటించడం గమనార్హం.  

చదవండి: (భారత గడ్డపై తొలి బడ్జెట్‌కు 162 ఏళ్లు..)

పింక్‌ బుక్‌లో ఏముందో..  
వందేభారత్‌ మినహా కొత్త రైళ్లు లేనట్లే. సికింద్రాబాద్‌ నుంచి విశాఖ, తిరుపతి, షిరిడీ, శబరి, తదితర ప్రాంతాలకు కొత్త రైళ్లకు డిమాండ్‌ ఉన్నప్పటికీ కొత్తగా రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం లేదని రైల్వే వర్గాలు  చెబుతున్నాయి. సరుకు రవాణా టర్మినళ్లపై కూడా పింక్‌బుక్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  
మరోవైపు  ఇప్పటికే  కొనసాగుతున్న కొత్త లైన్‌ల నిర్మాణం, ఎంఎంటీఎస్‌ రెండోదశ, యాదాద్రికి ఎంఎంటీఎస్, చర్లపల్లి రైల్వే టర్మినల్‌ విస్తరణ తదితర పనులకు  ఏ మేరకు నిధులు  విడుదలవుతాయనేది పింక్‌బుక్‌ వస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.  
వందేభారత్‌ రైళ్లపై కూడా కచ్చితమైన అంచనాలు ఉన్నప్పటికీ ఏయే రూట్‌లలో ఎప్పటి నుంచి ప్రవేశపెడుతారనేది పింక్‌బుక్‌లోనే తేలనుంది.

చదవండి: (బడ్జెట్‌ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?)

మరిన్ని వార్తలు