7 కొత్త వైద్య కళాశాలల్లో 7,007 పోస్టులు

25 Jun, 2021 08:09 IST|Sakshi

కొత్తగా సృష్టిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు

భర్తీకి చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖకు సూచన

నర్సింగ్‌ కళాశాలల్లో 720 పోస్టుల కల్పన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం 7,007 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి–కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌లో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మాకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, టీబీసీడీ, డీవీఎల్, సీటీ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, యూరాలజీ, గాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్, సైకియాట్రి, పీడియాట్రిక్స్, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆప్తల్, ఓబీసీ, రేడియో డయాగ్నసిస్, అనస్తీషియా, డెంటల్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫ్యూజియన్‌ మెడిసిన్‌(బ్లడ్‌ బ్యాంక్‌) స్పెషాలిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సీనియర్‌ రెసిడెంట్, జూనియర్‌ రెసిడెంట్, ట్యూటర్, ల్యాబ్‌ టెక్నిషియన్స్‌/టెక్నీషియన్స్‌ తదితర పోస్టులు ఉన్నాయి. తమ శాఖ నుంచి అనుమతి తీసుకుని పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను ఆర్థిక శాఖ సూచించింది.

15 నర్సింగ్‌ కళాశాలలకు 720 పోస్టులు 
రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచి ర్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, గద్వాలలో కొత్తగా ఏర్పాటు కానున్న 13 ప్రభుత్వ నర్సింగ్‌ కళా శాలలతో పాటు జగిత్యాలలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల, గాంధీ ఆస్పత్రి నర్సింగ్‌ కళాశాలల కోసం 720 పోస్టులను సృష్టిస్తూ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో 15 ప్రిన్సిపల్, 15 వైస్‌ ప్రిన్సిపల్‌ కమ్‌ ప్రొఫెసర్, 105 ప్రొఫెసర్, 180 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 300 లెక్చరర్, 15 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, 15 ఆఫీస్‌ సూపరింటెండెంట్, 30 సీనియర్‌ అసిస్టెంట్, 15 లైబ్రేరియన్, 30 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు