గిన్నిస్‌లోకి భాగ్య‘నగ’లు!

29 May, 2023 03:39 IST|Sakshi

 హైదరాబాద్‌ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ఆభరణాలకు 8 గిన్నిస్‌ రికార్డులు

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్‌ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్‌ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన,  అత్యంత బరువుగల  (1,681.820 గ్రాములు) బంగారు రామ్‌దర్బార్‌ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్‌ లేయర్‌ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూ­తద్దం గిన్నిస్‌లో చోటుదక్కించుకున్నాయి.

ఆది­వారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్‌నారాయణ్‌ జ్యుయలర్స్‌ ఎండీ తుషార్‌ అగర్వాల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్‌ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్‌ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి  ప్రదర్శించింది. 

మరిన్ని వార్తలు