కొలువు పోయిందా... సగం జీతం తీసుకో! 

20 Sep, 2020 04:28 IST|Sakshi

ఈఎస్‌ఐసీ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఉపశమనం కల్పించిన కేంద్ర కార్మిక శాఖ 

గరిష్టంగా 3 నెలల వరకు సాయం 

లాక్‌డౌన్, అనంతర పరిస్థితులతో ఉద్యోగం కోల్పోయిన వారికి ఏబీవీకేవై

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారా..? ఇలాంటి వారికి కొత్తగా మరో ఉద్యోగం దొరికేవరకు తాత్కా లిక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటల్‌ బీమిత్‌ వ్యక్తి కళ్యాణ్‌ యోజన (ఏబీవీకేవై) పథకం కింద 3 నెలల పాటు సగం జీతం ఇచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ పథకం కనీసం రెండేళ్ల సీనియర్‌ ఈఎస్‌ఐ చందాదారులైన వారికి మాత్రమే వర్తిస్తుంది. కోవిడ్‌–19 వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ విధించింది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ లాక్‌డౌన్‌... ఆ తర్వాత దశలవారీగా అన్‌లాక్‌ నిబంధనలతో పలు వ్యాపారాలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు ఏకంగా 50శాతం ఉద్యోగాలను కోతపెట్టాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా పలువురు నిరుద్యోగులుగా మారారు. వారికి కుటుంబపోషణ భారమైంది. ఈ పరిస్థితిని సమీక్షించిన కేంద్ర కార్మిక శాఖ ఇలాంటి వారికి నిరుద్యోగ పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. 

నెల తర్వాత దరఖాస్తు... 
ఏదేని కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కోవిడ్‌–19 కారణంగా జాబ్‌ కోల్పోతే నెలరోజుల తర్వాత ఈ పథకానికి అర్హత సాధిస్తాడు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా, ఈఎస్‌ఐసీ వివరాలతో ఆన్‌లైన్‌లో ఈఎస్‌ఐసీ పోర్టల్‌లో దర ఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మాన్యువల్‌ పద్ధతిలో ఈఎస్‌ఐసీ కార్యాలయంలో కూడా ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులో యాజమాన్యం నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. దరఖాస్తు పరిశీలించిన అనంతరం లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో ఈ నగదును జమ చేస్తారు. నిర్దేశించిన గరిష్ట గడువులోగా ఉద్యోగం వెతుక్కునేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది. 

సాయంగా సగం జీతం... 
ఏబీవీకేవై పథక కింద లబ్ధిదారులకు నెలలో సగం జీతాన్ని సాయంగా ఇస్తారు. ఈ పథ కం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి వరుసగా రెండేళ్ల పాటు ఈఎస్‌ఐ చందా చెల్లిస్తూ ఉం డాలి. ఆ వ్యక్తి రెండేళ్ల వేతనాన్ని రోజువారీ వేతన రూపంలో లెక్కించిన తర్వాత... నెల లో పదిహేను రోజుల భత్యాన్ని లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈఎస్‌ఐసీ నిబంధనల్లో ఈ వెసులుబాటు ఒక ఉద్యోగి తన జీవిత కాలంలో ఒకేసారి వినియోగించుకునే వీలుంది. సగం జీతం ఇచ్చే నిబంధన ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కాలంలో వచ్చిన దరఖాస్తులకు మా త్రమే వర్తిస్తుందని కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చే దర ఖాస్తులకు 25 శాతం వేతనాన్ని ఇస్తారు. 

మరిన్ని వార్తలు