ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు

20 Feb, 2022 04:59 IST|Sakshi
ఘటనపై ఆరా తీస్తున్న డీఈవో, ఆర్డీఓ తదితరులు 

తీవ్రంగా గాయపడిన విద్యార్థి 

ఇన్ముల్‌నర్వ ప్రభుత్వ పాఠశాలలో ఘటన

కొత్తూరు: ప్రమాదవశాత్తు ఐదేళ్ల విద్యార్థికి మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. ఎంఈవో కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇమామ్, షభానాబేగంలకు ముజామిల్‌ (5)తో పాటు మూడేళ్ల వయస్సున్న కూతురు ఉంది. ముజామిల్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్తున్న క్రమంలో 9.30 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ పక్కన విద్యార్థికి మంటలు అంటుకోవడాన్ని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు మంటలను ఆర్పేసి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు.

వారు షాద్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, షాద్‌నగర్‌ ఆర్డీఓ రాజేశ్వరితో పాటు ఎంఈవో కృష్ణారెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పాఠశాల సమీపంలో చెత్తకు పెట్టిన నిప్పు వద్ద బాధిత విద్యార్థితో పాటు మరో బాలుడు ఆడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఎంఈవో తెలిపారు.

మరిన్ని వార్తలు