లైంగిక వేధింపులపై మాట్లాడాలి : ప్రముఖ రచయిత్రి

10 Dec, 2021 09:26 IST|Sakshi
ఐసీసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన çసమావేశంలో పాల్గొన్న అతిథులు

సాక్షి, రాయదుర్గం(హైదరాబాద్‌): ‘ఇజ్జత్‌’ భయంతో లైంగిక వేధింపులపై మౌనంగా ఉండవద్దని, అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఇంటర్నల్‌ కంప్లయింట్‌ కమిటీ)కి నివేదించాలని ప్రముఖ మహిళా ఉద్యమకారిణి, రచయిత్రి జమీలా నిషాత్‌ బాలికలకు సూచించారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని సయ్యద్‌ హమీద్‌సెంట్రల్‌ లైబ్రరీలో ఐసీసీ మనూ ఆధ్వర్యంలో ‘సెక్సువల్‌ హరాష్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌ యాక్ట్‌–2013పై అవగాహనా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బాలికలు, మహిళలు అనుచితంగా భావించే ఏఅంశంపైనైనా ఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ఈ సందర్భంగా పలు సంఘటనలు, లైంగిక వేధింపుల యొక్క వివిధ షేడ్స్, ముఖ్యంగా పరిశోధనా సమయంలో జరిగే అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. సెంటర్‌ ఫర్‌ విమెన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ షాహిదా మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులను చేర్చడానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రొఫెసర్‌ మహ్మద్‌ షాహిద్‌ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాయన్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఐసీసీ చైర్‌çపర్సన్‌ ప్రొఫెసర్‌ షుగుప్తా షాహిన్, ఐసీసీ కన్వీనర్‌ డాక్టర్‌ షంషుద్దిన్‌ అన్సారీ, సభ్యుడు డాక్టర్‌ బీబీ రజాఖాతూన్‌ తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: యువతి అదృశ్యం 

>
మరిన్ని వార్తలు