సంచిలో వేసుకుని కిడ్నాప్‌.. అసలు విషయం ఇదట

8 Apr, 2021 15:04 IST|Sakshi

నడ్కుడలో కిడ్నాప్‌ కలకలం

బైక్‌కు తగిలి కింద పడిన పాప

కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడంటూ దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

వేల్పూర్‌: మండలంలోని పచ్చల నడ్కుడ గ్రామంలో బుధవారం కలకలం రేగింది. బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లు అనుమానించిన స్థానికులు.. ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చి సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి కిడ్నాప్‌ యత్నం జరగలేదని తేల్చారు. బాలిక డ్రెస్‌ బైక్‌కు తట్టుకుని కొద్దిదూరం ఈడ్చకుంటూ వెళ్లిందని స్పష్టంచేశారు. అసలేం జరిగిందంటే.. జుక్కల్‌ ప్రాంతానికి చెందిన అశోక్, రేఖ దంపతులు రెండు నెలల క్రితం నడ్కుడకు వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు.

వారి నాలుగేళ్ల కూతురు శ్రావణి బుధవారం సాయంత్రం ఇంటి నుంచి దుకాణానికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతోంది. అదే సమయంలో నిజామాబాద్‌కు చెందిన షేక్‌ రెహమాన్‌ భీమ్‌గల్‌లో ఉండే అత్తగారింటికి ద్విచక్ర వాహనంపై నడ్కుడ మీదుగా వెళ్తున్నాడు. అతడి బైక్‌ శ్రావణి డ్రెస్సుకు తట్టుకుని కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. అక్కడే ఉన్న స్థానికులు బాలికను కిడ్నాప్‌ చేసి, సంచిలో వేసుకుని వెళ్తుండగా జారి పడిందని అనుమానించారు. 

ఈ విషయం గ్రామంలో వ్యాపించి వందల మంది అక్కడకు వచ్చి రెహమాన్‌ను బంధించి గ్రామపంచాయతీ వద్దకు తీసుకెళ్లి దేహశుద్ధి చేశారు. అయితే, ఈ విషయం తెలిసి పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. బాలికతో పాటు ఆమె వెంట ఉన్న బాలుడ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. బాలిక కిడ్నాప్‌ కాలేదని, డ్రెస్‌ తట్టుకుని పడిపోయిందని సీసీటీవీ ఫుటేజీలో తేలిందని ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు.  

చదవండి: వైరల్‌: పిల్లి పిల్లను కిడ్నాప్‌ చేసిందిరోయ్‌‌

మరిన్ని వార్తలు