రంగారెడ్డి యువతి కిడ్నాప్‌ కేసు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నవీన్‌ రెడ్డి

13 Dec, 2022 21:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆధిభట్ల యువతి వైశాలి కిడ్నాప్‌ కేసు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కాండోలిమ్‌ బీచ్‌ దగ్గర నవీన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉబ్లీ, పనాజీ మీదుగా నవీన్‌ రెడ్డి గోవా వెళ్లిన్నట్లు గుర్తించారు. అతని దగ్గరున్న 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవన్‌ రెడ్డిని పోలీసులు హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. కాగా ఈ కేసులో మంగళవారం ఉదయమే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి వైశాలి డిసెంబర్‌ 9న కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. యువతితో పరిచయం ఉన్న నవీన్‌ రెడ్డి అతని అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై దాడికి తెగబ్బారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. వైశాలిని కిడ్నాప్‌ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు.

తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్‌ రెడ్డి, అతని స్నేహితులు అదే రోజు సాయంత్రం మళ్లీ కారులో హైదరాబాద్‌ తీసుకొచ్చారు.  రాత్రి సమయానికి యువతిని పోలీసులు రక్షించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నవీన్‌ రెడ్డిని తాజాగా పోలీసులు గోవాలో అరెస్ట్‌ చేశారు.
చదవండి: యువతి కిడ్నాప్‌ కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

మరిన్ని వార్తలు