‘రైతుబంధు’ వినూత్నం: నిరంజన్‌రెడ్డి  

4 Jan, 2022 01:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ముద్ర ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది ప్రపంచంలోనే వినూత్న ఆలోచన అని పేర్కొన్నారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ప్రత్యేక కమిషనర్‌ హన్మంతు తదితరులు ఇందులో పాల్గొన్నారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ విజయ కిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర వజ్రంలాంటిదన్నారు.

కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వరి పంటలో పంజాబ్‌ను మించిపోవడం అసాధారణ విజయమన్నారు. 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. వ్యవసాయ రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు