మోదీ, కేసీఆర్‌లపై పోరాడతాం: మాణిక్యం ఠాగూర్

28 Sep, 2020 15:48 IST|Sakshi

తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్ చిట్‌చాట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ సోమవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ మార్పు వంటి అంశాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘మా లక్ష్యం మిషన్-2023. మోదీ, కేసీఆర్‌ విధానాలపై పోరాడతాం. సిస్టమేటిక్ టీం వర్క్‌తో ముందుకు వెళతాం. తెలంగాణలో సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు పాటించాలి. దేశంలోని ప్రతి గవర్నర్ మేము ఇచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ మాత్రం వినతి పత్రం తెలుసుకోలేదు. గవర్నర్ కార్యాలయంలో అపాయింట్‌మెంట్‌ కోరాం.. ఇవ్వలేదు. కోవిడ్ ఒక్క తెలంగాణలోనే లేదు. వినతిపత్రం మెయిల్ చేయమని చెప్పారు. కార్యకర్తల, నేతల మధ్య ఐక్యత కీలకం’ అన్నారు. (చదవండి: 2023లో అధికారమే లక్ష్యం )

దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం మొదలు పెట్టాయి. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ.. కుందేలు- తాబేలు కథలో.. చివరకు ఏం జరిగింది అనేది అందరికి తెలుసు అన్నారు. తెలంగాణ నేతలను ఇండియన్ క్రికెట్ టీంతో పొల్చారు. కాంగ్రెస్‌లో గ్రూపులపై స్పందిస్తూ.. ఐక్యతతో 2023 లో గెలుస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం అన్నారు. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇక పీసీసీ చీఫ్ మార్పు గురించి తానేమి చెప్పలేనన్నారు మాణిక్యం ఠాగూర్.

మరిన్ని వార్తలు