బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను రెండవరోజు కస్టడీలోకి తీసుకున్నారు. బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్లో ఆమెను బోయినపల్లి పోలీసులు విచారిస్తున్నారు. భార్గవ్ రామ్ సహా ఇతర నిందితులు ఎక్కడున్నారు అన్న కోణంలోనూ విచారణ జరగనుంది. అంతేకాకుండా బాధిత కుటంబంతో బలవంతంగా సంతకాలు సేకరించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నల వర్షం కురింపించనున్నారు. (కథ.. స్క్రీన్ప్లే.. దర్శకత్వం.. భూమా అఖిలప్రియ!)
మరోవైపు ఈ కేసులలో నిందితులు భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏ క్షణం అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో పాటుమొత్తం మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భార్గవ్రామ్, గుంటూరు శ్రీనులు పథకం ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు ఉపయోగించిన కార్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (అఖిలప్రియ బయటకొస్తే సాక్ష్యుల్ని బెదిరించవచ్చు )