జలవిహార్‌లో సందడిగా ‘అలయ్‌- బలయ్’ కార్యక్రమం

17 Oct, 2021 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అలయ్‌- బలయ్’ కార్యక్రమం ఆదివారం జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌదర్యరాజన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గిరిజన మహిళలలో నృత్యం చేశారు. అలయ్‌- బలయ్‌ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం‍లో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, తెలంగాణ మండలి ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ, నటుడు కోట శ్రీనివాస్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. కలిసి తిందాం, కలిసి పాడుదాం, కలిసి ఆడుదాం అనే సంప్రదాయం ‘అలయ్ బలాయ్’ కార్యక్రమానిదని తెలిపారు. ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కొనసాగుతోందని తెలిపారు. 



హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘అలాయ్ బలాయ్’ తెలంగాణ రుచులను ప్రోత్సహిస్తూ.. ప్రతి ఒక్కరిని సమానదృష్టితో చూస్తుందని తెలిపారు. తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిందని అన్నారు. పార్టీలకు జెండాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తెచ్చేది ‘అలయ్ బలాయ్’ అని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని తరతరాలకు అందించడమే ‘అలయ్ బలాయ్’ ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రతి ఏటా గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ‘అలయ్ బలాయ్’ కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి గవర్నర్ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు. దసరా పండగ తర్వాత రెండో రోజు అలయ్ బలాయ్ నిర్వహిస్తారు. అలయ్ బలాయ్‌లో తెలంగాణ వంటల(వెజ్, నాన్‌ వెజ్)తో సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు