సఖి కేంద్రంలోనే రాత్రి నిద్ర.. మహిళా సిబ్బందితో అసభ్యంగా..

11 May, 2022 19:07 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: ఆపదలో చిక్కుకున్న మహిళలకు ఆశ్రయమిచ్చి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి జిల్లాలో సఖి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా ఎన్జీఓల పర్యవేక్షణలో నడుస్తుండటంతో పలు వివాదాలకు నిలయాలుగా మారాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల సఖీ కేంద్రం డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోంది. సఖి కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నాడని, నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని, మహిళా సిబ్బందితో అసభ్యంగా మాట్లాడుతాడనే ఆరోపణలు వెంకట్‌రెడ్డిపై ఉన్నాయి.

రాత్రివేళ వెంకట్‌రెడ్డి సఖి కేంద్రంలోనే నిద్రిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం రాత్రి సఖి కేంద్రంలో వెంకట్‌రెడ్డి ఎంజాయ్‌ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రాత్రి 12గంటలకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా వెంకట్‌రెడ్డి అక్కడే ఉండటంతో విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. నిబంధనల మేరకు పురుషులు రాత్రి సమయంలో అక్కడ ఉండటం నిశిద్ధం. అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో చనువుగా ఉండటం కోసమే వెంకట్‌రెడ్డి తరచూ అక్కడ బస చేస్తాడని గుసగుసలు వినపడుతున్నాయి. దీనిపై వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా.. విధుల్లో భాగంగానే రాత్రివేళ సఖి కేంద్రంలో ఉన్నానే తప్ప.. తనకు మరో ఉద్ధేశం లేదని తెలిపాడు.
చదవండి: అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి..

మరిన్ని వార్తలు