అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీకి 

24 Sep, 2021 02:39 IST|Sakshi

పాదయాత్రగా వెళ్లనున్న బీజేపీ ఎమ్మెల్యేలు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు.. ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి శాసనసభ దాకా పాదయాత్రగా వెళ్లనున్నారు. ఈ సమావేశాల్లో దళితబంధు, దళితులకు కేటాయించిన అసైన్డ్‌ భూములు, పోడు భూములు, ఎస్టీలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు ప్రస్తావించాలని బీజేపీ నిర్ణయించింది.

అలాగే అసరా పింఛన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను చర్చించాలని భావిస్తోంది. గురువారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో రాజాసింగ్, రఘునందన్‌రావు భేటీ అయ్యారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సంజయ్‌ సూచించారు. అధికార పార్టీ నియంతృత్వ ధోరణిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీదేనని చాటాలని సూచించారు.   

మరిన్ని వార్తలు