ఆగిపోయిన గుండెకు మళ్ళీ ఊపిరి పోసిన అంబులెన్స్ సిబ్బంది..

28 Jul, 2021 09:33 IST|Sakshi

కరీంనగర్‌: అంబులెన్స్‌ సిబ్బంది సమయస్ఫూర్తీతో ఆగిపోయిన గుండెకు మళ్లీ ఊపిరిపోసి మానవత్వం చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. కాగా, మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. బాబుకు అనారోగ్యం కారణంగా నిన్న కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒ‍క్కసారిగా, బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే వరంగల్‌ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించారు.

దీంతో సీరియస్‌ కండిషన్‌లో ఉన్న తమ బాలుడిని కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే, అంబులెన్స్‌లో ప్రయాణిస్తుండగా.. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

మరిన్ని వార్తలు