లక్కీడ్రాకు ఒక్క రోజే గడువు.. ఇప్పటికే ప్రభుత్వానికి రూ.100 కోట్లకుపైగా ఆదాయం

17 Nov, 2021 19:33 IST|Sakshi

గ్రేటర్‌లో 615 దుకాణాలకు 3వేలకు పైగా.. 

శివార్ల వైపే ఆసక్తి చూపుతున్న వ్యాపారులు

ఫీజుల రూపంలో రూ.100 కోట్ల ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: మద్యం దుకాణాలకు దరఖాస్తుల వరద పారుతోంది. ఒక్కో దుకాణానికి ప్రస్తుతం నాలుగు నుంచి అయిదుగురు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల ఆరుగురు వరకు పోటీలో ఉన్నారు. లక్కీడ్రాకు రేపు ఒక్కరోజే గడువు ఉండడంతో మరింత మంది బరిలోకి దిగే అవకాశం ఉంది. గత వేలంలో కంటే ఈసారి పోటీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అత్యధిక మంది పోటీలో ఉన్నారు. మరోవైపు  మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని నగర శివారు ప్రాంతాలకు సైతం భారీ స్పందన కనిపిస్తోంది.  
చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు 1000 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. రంగారెడ్డిలో 234 మద్యం షాపులకు 1,160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్‌ జిల్లాలోని 202 వైన్‌ షాపులకు ఇప్పటివరకు 800కుపైగా దరఖాస్తులు అందాయి. ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండటంతో మూడు జిల్లాల్లో కలిపి మరో రెండు వేలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుదారుల నుంచి ఫీజుల రూపంలో ఈసారి  రూ.100 కోట్లకుపైగా లభించే అవకాశం ఉంది.
చదవండి: ఏం ఫ్యామిలీరా బాబూ..! భార్య ఇంట్లోకి వెళ్లి సర్దేస్తుంది.. అనంతరం కూతురితో కలిసి..

అందరి చూపూ అటువైపే..  
కోవిడ్‌ కారణంగా వ్యాపార రంగంలో నెలకొన్న స్తబ్దత క్రమంగా తొలగిపోతోంది. కొంతకాలంగా నగర శివార్లలో  అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో పాటు నగరానికి నాలుగు వైపులా రియల్‌ ఎస్టేట్‌  రంగం కూడా  పుంజుకుంది. భారీ ఎత్తున బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. నగర శివార్లలో వందల కొద్దీ కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి.

ఇందుకనుగుణంగానే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొత్త ఎక్సైజ్‌ పాలసీలో ఎక్కువ మంది వ్యాపారులు నగర శివార్లలోనే మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. ఈ ఏడాది మద్యం విక్రయాలపై రూ.11వేల కోట్ల వరకు ఆదాయం లభించగా అందులో  సింహభాగం ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే కావడం విశేషం. 

మరిన్ని వార్తలు