Telangana: రాత్రికి రాత్రే ఊరు ఖాళీ

17 Aug, 2021 02:46 IST|Sakshi
ఊరు ఖాళీ చేయించొద్దంటూ విలపిస్తున్న మహిళలు 

30 డీసీఎంలతో వచ్చిన అధికారులు 

నష్టపరిహారం చెల్లించకుండా ఇదేం దారుణం? 

అధికారులతో రాంపురం గ్రామస్తుల వాగ్వాదం

తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కింది ముంపు గ్రామం రాంపురం మదిర వడ్డెర కాలనీ వాసులను సోమవారం రాత్రికి రాత్రే అధికారులు ఖాళీ చేయించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ కాలనీలో సుమారు 75 కుటుంబాలు నివాసముంటున్నాయి. అందులో మెజార్టీ కుటుంబాలు ఇప్పటికే గ్రామం నుంచి వెళ్లి పోగా సోమవారం రాత్రి 30 డీసీఎంలు తీసుకుని తహసీల్దార్‌ బాల్‌రెడ్డి, ఆర్‌ఐ రవీందర్‌ కాలనీకి వచ్చారు.


కాగా తమకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుండా ఎలా ఖాళీ చేయిస్తారంటూ నిర్వాసితులు అధికారులతో గొడవకు దిగారు. అర్ధరాత్రి తాము ఎక్కడికి వెళ్లేదంటూ మహిళలు, పురుషులు బోరున విలపించారు. అర్హులైన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లింస్తుందంటూ అధికారులు వారికి నచ్చజెప్పారు. రెండు మూడు రోజుల్లో రిజర్వాయర్‌లోకి నీరు వదిలేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు వారికి వివరించారు. ఎట్టకేలకు వడ్డెర కాలనీలోని సుమా రు 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు.  

 

మరిన్ని వార్తలు