పూర్వ వైభవం తీసుకొస్తాం

21 Sep, 2021 02:44 IST|Sakshi
బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్‌.  చిత్రంలో ఎంపీ సురేశ్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు 

బాజిరెడ్డి గోవర్ధన్‌

ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం..  అభినందించిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కవిత

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొస్తామని సంస్థ నూతన చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. ఖర్చులు తగ్గించు కోవటంతోపాటు సంస్థ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవటం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను మెరుగు పరుస్తామని అన్నారు. కొత్త ఎండీగా నియమితులైన డైనమిక్‌ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌తో కలసి కష్టాల్లో ఉన్న ఆర్టీసీని పురోగమించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సోమవారం ఉదయం ఆయన బస్‌భవన్‌లో సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు అభినం దనలు భఃతెలిపారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ ప్రజాజీవితంతో ముడిపడిఉన్న సంస్థ అని, అందరికీ ఆర్టీసీతో అనుబంధం ఉంటుం దని, అలాంటి సంస్థను బతికించుకునేందుకు ప్రజలు కూడా ముందుకు రావాలని పేర్కొ న్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించటం ద్వారా సంస్థ ఆదాయం పెరిగేందుకు సాయం చేయాలని, సురక్షిత ప్రయాణం ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని అన్నారు. కష్టపడి పనిచేసే తత్వమున్న సిబ్బంది, అనుభవం ఉన్న అధికారులున్నందున అంద రినీ కలుపుకొనిపోయి సంస్థను అభివృద్ధి బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కోవిడ్‌ లాంటి క్లిష్ట సమయంలో కూడా ఆర్టీసీ ప్రజలకు సేవలందించిందని, అలాంటి సంస్థను కాపాడుకోవటం మన విధి అని స్పష్టంచేశారు.

కేంద్ర ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మబోమని అన్నారు. కొత్తగా ప్రారంభమైన కార్గో అండ్‌ పార్శిల్‌ సర్వీసులను బలోపేతం చేయడం, ఆర్టీసీ స్థలాల్లో ఏర్పాటైన పెట్రోల్‌ బంకులను మెరుగ్గా నిర్వహించటం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామన్నారు. అనంతరం ఆర్టీసీ కల్యాణమండపంలో కార్యకర్తలు, నేతలతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు మూడు వేల మంది వరకు కార్యకర్తలు, నాయకులు బస్‌భవన్‌కు తరలిరావడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు