బీజేపీ బరాబర్ హిందువుల పార్టీ

9 Nov, 2020 15:17 IST|Sakshi

బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం దుర్గానగర్ చౌరస్తాలో జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌,  డీకే అరుణ,  జితేందర్‌ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీ బరాబర్ హిందువుల పార్టీ అని అన్నారు. హిందు ధర్మానికి అడ్డం వచ్చిన వాళ్ళను తొక్కేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నియంతగా వర్ణించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్ధలు కొడతామన్నారు.

తెలంగాణలో బియ్యం, డబుల్ బెడ్రూం, రోడ్లు, లైట్లు, టాయిలెట్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే అని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేస్తాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరద నష్టంపై ఇంటింటికీ సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే.. కేసీఆర్ లాడెన్, బాబార్, అకర్బ్ వారసుడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తోన్న కేసీఆర్‌ను బొంద పెడతామని ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. హిందువులను అవమానిస్తోన్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  మాట్లాడుతూ.. ‘ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 75స్థానాలు గెలుస్తుంది. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఇంటి పక్కన ఉన్న దుబ్బాక ప్రజలే కేసీఆర్ మాటలు నమ్మటం లేదు. కేసీఆర్‌ను ఫాంహౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. హైద్రాబాద్ నగర అభివృద్ధిపై హామీలు ఇచ్చింది కేసీఆరా? ప్రధాని మోదీనా? తెలంగాణకు టీఆర్ఎస్ వద్దు బీజేపీనే ముద్దు. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ జూఠా మాటలు చెప్పింది. వరద బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధ్యతారాహిత్యం. కేంద్రం నిధులను ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారు. నియంత నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. మోదీ ఫోటో ముద్రించాలనే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయటం లేదు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు