న్యాయవాదుల హత్య : సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

20 Feb, 2021 17:05 IST|Sakshi

న్యాయవాదులుది ప్రభుత్వ హత్యే : సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై సీఎం కేసీఆర్‌ అదేశాలతోనే పోలీసులు దాడులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు తండాలో గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని,  60 రోజులు జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఆ భూమి గిరిజనులదే అని చెప్పిన హైకోర్టు ఉత్తర్వులను సైతం విస్మరించారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్‌.. గిరిజనుల భూములకోసం పోరాటానికి వెళ్లిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని అన్నారు. ఇష్టానుసారంగా లాఠీచార్జి చేశారని, ప్రయివేట్ గుండాలతో దాడులు చేయించారని ఆవేదన చెందారు. గుర్రంపోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలు, గిరిజనులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయలైనందుకు  బండి సంజయ్ క్షమాపణలు కోరారు. 

రిటర్డ్ ఐజీ ప్రభాకర్ రావు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గుండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. 2023 తర్వాత తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రభాకర్ రావు అక్రమాస్తుల చిట్టా విప్పుతానని.. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పెద్దపల్లి అడ్వకేట్ దంపతుల హతపై సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. వామనరావు దంపతులది ప్రభుత్వ హత్యేనని అన్నారు. యధా రాజా తథా ప్రజా అన్నట్టుగా రాష్ట్రంలో గుండాలు, రౌడీలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. సొంత ఎమ్మెల్యేలు, మంత్రులే కేసీఆర్‌పై తిరగబడే రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరి అవినీతి చిట్టా బయటకు తీస్తున్నాఅని అన్నారు.  

మరిన్ని వార్తలు