సీఎం కేసీఆర్‌ కుండలు పెట్టి  బిందెలు ఎత్తుకెళ్లే రకం

15 Jul, 2021 03:39 IST|Sakshi

కేసీఆర్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ధ్వజం

కవితను టీఆర్‌ఎస్‌ వారే ఓడించారు

జగిత్యాల (కరీంనగర్‌): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కుండలు పెట్టి బిందెలు ఎత్తుకుపోయే రకమని, రూ.2 వేల పింఛను ఆశ చూపి డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు ఎసరు పెట్టారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ధ్వజమెత్తారు. జగిత్యాలలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే..ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. బీజేపీకి బద్ధశత్రువైన మమతా బెనర్జీ కూడా పశ్చిమబెంగాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించారని, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పేదలకు లక్షలాది ఇళ్లు నిర్మించి ఇచ్చారని తెలిపారు. మాజీ ఎంపీ కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించి జగిత్యాలకే 4 వేల ఇళ్లు మంజూరు చేయించి ఉంటారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో అంతర్గత కారణాలతో కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, ఎంపీగా పోటీచేస్తే టీఆర్‌ఎస్‌ వారే ఓడించారని వ్యాఖ్యానించారు.  

>
మరిన్ని వార్తలు