బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్‌ అప్లై

28 Nov, 2022 12:24 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ జిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర జరుపుకోవాలని తెలిపింది. అలాగే బహిరంగ సభ బైంసా టౌన్‌లో నిర్వహించడానికి వీళ్లేదని.. సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తేనే సభకు అనుమతించాలని కోర్టు పేర్కొంది.

కాగా బండి సంజయ్‌  పాదయాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ సోమవారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ తీరును ఖండిస్తూ పాదయాత్రకు తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్‌ పాదయాత్రపై విచారణ చేపట్టింది ఉన్నత న్యాయస్థానం. బైంసా సిటీలోకి పాదయాత్ర వెళ్లదని బీజేపీ తరపున న్యాయవాది రామచందర్‌ రావు కోర్టుకు తెలిపారు. దీంతో బైంసాలోకి పాదయాత్ర వెళ్లకుంటే పోలీసులకు అభ్యంతరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సభలు, పాదయాత్రలు రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. 
చదవండి: హైదరాబాద్‌ మెట్రోకు అయిదేళ్లు.. తీరని నష్టాలు.. తప్పని సవాళ్లు

బైంసాలో టెన్షన్‌
బండి సంజయ్‌ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించడంతో సోమవారం బైంసాలో టెన్షన్‌ నెలకొంది. బైంసాలోని ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ వద్ద ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ వద్ద బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బైంసాలో 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు పోలీసులు తీరుపై బీజేపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు