రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ త్వరలో ఎత్తివేత!: బండి సంజయ్‌

18 May, 2023 09:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ త్వరలోనే ఎత్తివేయనున్నట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ప్రకటించారు. ఆ మేరకు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశామని, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. నిజాంకాలేజీ మైదానంలో ‘ఖేలో భారత్‌.. జీతో భాగ్యనగర్‌’పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల ఫైనల్స్‌ను తిలకించడానికి వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా సమస్యలపై ప్రశ్నించే మీడియాను ప్రభుత్వం నిషేధిస్తోంది. మరో ఐదు నెలలు ఆగితే.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధించబోతున్నారు.

ప్రజలు అల్లాడుతుంటే.. ప్రజాధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారు. బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇస్తున్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. తన పాలనలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’అని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ ఓపీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ‘ఖేలో భారత్‌.. జీతో భాగ్యనగర్‌’పేరుతో హైదరాబాద్‌లో క్రీడా పోటీలు నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు.

యువతకు క్రీడా స్పూర్తి చాలా అవసరమని, సమష్టిగా పని చేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి క్రీడలే ఉదాహరణ అని సంజయ్‌ తెలిపారు. పంటనష్టపోయి రైతులు ఏడుస్తుంటే.. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే.. చూస్తూ అవసరం లేకపోయినా కేసీఆర్‌ కొత్త సచివాలయం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఓ వర్గం మీడియా తనపైనా అసత్య ప్రచారం చేస్తోందని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.   
చదవండి: Karnataka: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్‌.. సీఎం ఆయనే! 

మరిన్ని వార్తలు