కేసీఆర్‌ బెదిరింపులకు భయపడం.. బండి సంజయ్‌

18 Nov, 2021 01:46 IST|Sakshi

సీఎంగా బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేసీఆర్‌.. వెంటాడుతాం, వేటాడుతాం.. అంటూ మాట్లాడటం సరికాదని, ఆయన భాష మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సూచించారు. ఆ బెదిరింపులకు తాము భయపడేదే లేదన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ బెదిరింపులకు ఆయన మోచేతి నీళ్లు తాగేవాళ్లు భయపడతారేమో కానీ, తాము కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసమస్యలపై శాంతియుతంగా ఆందోళనలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సీఎంగా బాధ్యతాయుతహోదాలో ఉన్న కేసీఆర్‌.. వెంటాడుతాం, వేటాడుతామంటూ మాట్లాడటం సరికాదని, ఆయన భాష మార్చుకోవాలని సూచించారు.

దళితబంధు అమలు, ఉద్యోగాల నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, పంట కొనుగోళ్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బుధవారం ఆయన పార్టీ నాయకులు రాజాసింగ్, విజయరామారావు, జి.మనోహర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, జి.ప్రేమేందర్‌రెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడు తూ తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్‌ రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా.. లేదా? అన్న ప్రశ్నకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో కల్లాలు, రోడ్లపై పోసిన ధాన్యం తడిసిపోతున్నదని, సీఎంకు సోయి తెప్పించేందుకు రైతుల ఇబ్బందుల పరిశీలనకు వెళితే టీఆర్‌ఎస్‌ నాయకులు దాడులు చేస్తారా అని సంజయ్‌ ప్రశ్నించారు.  కేసీఆర్‌ను ఫామ్‌ హౌస్‌ నుంచి ప్రగతి భవన్‌కు, అక్కడి నుంచి ధర్నా చౌక్‌ దగ్గరికి తీసుకురావడం.. బీజేపీ, రాష్ట్ర ప్రజలు సాధించిన విజయమన్నారు. గురువారం జరిగే టీఆర్‌ఎస్‌ ధర్నాకు సీఎం కేసీఆర్‌ హాజరు కావడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసనలు తెలుపవచ్చని సంజయ్‌ బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు