Hyderabad: నగరం నడిబొడ్డున ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఇదా?.. వర్షం​ నీరు రంగు మారినా..

8 Sep, 2022 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నదానికి ఫిలింనగర్‌లోని బీజేఆర్‌ నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిని చూస్తే అర్థమవుతోంది. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ పాఠశాల వరద నీటితో నిండిపోయింది. అప్పటి నుంచి వరద నీటితో పాటు మురుగు కూడా పేరుకుపోయి ఆకుపచ్చ రంగులో నీళ్లు ఈ పాఠశాల దుస్థితిని కళ్లకు కడుతున్నాయి.

ఇప్పటికే ఇక్కడి విద్యార్థులను సమీపంలోని ఎంజీ నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తరలించారు. ఇప్పటి వరకు బీజేఆర్‌ నగర్‌ ప్రైమరీ స్కూల్‌ను మాత్రం బాగు చేయలేదు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఈ పాఠశాల చిక్కుకుంది. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులకు తీరిక దొరకడం లేదు. ఫలితంగా చిన్నారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.

ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు స్పందించిన పాపాన పోవడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ పాఠశాల ఉండటం విశేషం. పాఠశాల దుస్థితిని కళ్లకు కడుతూ మంత్రి కేటీఆర్‌కు ఫొటోల రూపంలో ట్వీట్‌ చేసినా అధికారులకు చలనం కరువైంది. 

చదవండి: (హెలికాప్టర్‌ అడిగితే ఇవ్వలేదు.. తెలంగాణ గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు