‘బీసీలను ఏకం చేసేందుకు బస్సు యాత్ర’ 

12 Dec, 2022 04:01 IST|Sakshi
నాయకులతో కలిసి అభివాదం చేస్తున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌  

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): బీసీ జనగణనపై పార్లమెంట్‌లో తీర్మానించకపోతే అమరావతి నుంచి హైదరాబాద్‌ వరకు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లోని ఒక హోటల్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన బీసీ సంఘాల నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడుతూ.. సంక్రాంతి నుంచి యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు.

దేశంలో అన్ని వర్గాలకు.. వారి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం కల్పించడం లేదని విమర్శించారు. ఈ విషయాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలను ఏకం చేసేందుకు బస్సు యాత్రతో పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం అ ధ్యక్షుడు శంకర్‌రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు