కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ఉండాల్సిందే 

23 Dec, 2022 01:48 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ కృష్ణయ్య డిమాండ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, నూతన పార్లమెంట్‌కు ఆయన పేరు పెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆర్‌.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని పరశురామ్‌ చేస్తున్న ఉద్యమం చాలా గొప్పది కాబట్టి.. ఈ అంశంపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జేరిపోతుల పరశురామ్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం, అంబేడ్కర్‌పై అభిమానం ఉంటే పార్లమెంట్‌లో వెంటనే బిల్లు పెట్టి అమలు చేయాలని.. లేని పక్షంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు