‘బడుగుల కోసం పోరాడిన మహానుభావుడు పూలే’ 

12 Apr, 2022 03:10 IST|Sakshi
పూలే జయంతి వేడుకల్లో మాట్లాడుతున్న వకుళాభరణం కృష్ణమోహన్‌రావు. చిత్రంలో జూలూరి గౌరీశంకర్, బుర్రా వెంకటేశం, ఆర్‌. కృష్ణయ్య తదితరులు 

గన్‌ఫౌండ్రీ: విద్యను ఆయుధంగా మార్చుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూలే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ జనగణనను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

పలు పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈనెల 16న ఆన్‌లైన్‌ వేదికగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి భట్టు మల్లయ్య, బీసీ కమిషన్‌ సభ్యుడు ఉపేంద్రచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు ఆనంద్‌కుమార్‌ గౌడ్, నీల వెంకటేశ్, రాజేందర్, బడేసాబ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు