తెలంగాణ: ఆ రెండు పార్టీలు దొందూ.. దొందే!

27 Oct, 2022 19:58 IST|Sakshi

సాక్షి, నారాయణ్‌పేట‌: కాంగ్రెస్‌ దృష్టిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటే అని ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణలో ఆయన ఆధ్వర్యంలో భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. గురువారం సాయంత్రం నారాయణపేటలో ఆయన ప్రసంగించారు. 

బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒక్కటే. నాణేనికి బొమ్మాబొరుసుల్లాంటివి. ఢిల్లీలో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు కేసీఆర్ పార్టీ వంతపాడింది. రాజకీయాలను ఈ రెండు పార్టీలు ధనప్రమేయం చేశాయి. వ్యాపార సంస్థలుగా కొనసాగుతున్నాయి. రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఇంకా బాధపడుతూనే ఉన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. 

పెట్రోల్ , డిజీల్ , గ్యాస్ ధరలు ప్రజలకు భారంగా మారాయి. ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ పని. తెలంగాణ టీఆర్‌ఎస్‌ సర్కార్‌.. అత్యంత అవినీతి ప్రభుత్వం.  మియాపూర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టులే అందుకు నిదర్శనం.  టీఆర్‌ఎస్‌పై రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం.

ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసమే భారత్‌ జోడో యాత్ర. దాదాపు 3,500 కిలో మీటర్లు నడవటం ఆషామాషీ కాదు. కానీ, మీ శక్తిని ధారపోసి నాతో అడుగేస్తుంటే … కష్టం తెలియటం లేదు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు